ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వధువు దొరక్క ముదిరిపోతున్న బ్రహ్మచారులు,,,,అమ్మాయి తల్లిదండ్రులకు అవగాహన కలిగించే ప్రయత్నం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 11:21 PM

పెళ్లి సంబంధాల విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఆడపిల్లను ఇచ్చే కుటుంబాల పుట్టుపూర్వోత్తరాల గురించి ఆరా తీస్తారు. ఆస్తుల కంటే ఆడపిల్ల కోడలిగా అడుగుపెట్టే ఇంటిలో ఆప్యాయతలు, అభిమానాలను చూసేవారు. కానీ, కాలంతో పాటు ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా వివాహాల విషయంలో ప్రయారిటీ కూడా మారిపోయింది. తాము పెళ్లిచేసుకునే అమ్మాయి అందంగా ఉండాలని, ఉన్నత విద్యావంతురాలై ఉండాలని అబ్బాయిలు భావిస్తున్నారు.


ఇక, అమ్మాయిలు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. అబ్బాయి అందగాడే కాదు.. లక్షల్లో జీతంతో మంచి ఉద్యోగం చేస్తూ.. అత్తమామలకు దూరంగా నగరాల్లో.. కుదిరితే విదేశాల్లో ఉంటే మరీ మంచిందని తమ గొంతెమ్మ కోర్కెల చిట్టా విప్పుతున్నారు. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదు. దీంతో గ్రామాల్లో పెళ్లికాని ప్రసాదుల కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన యువ రైతులు.. తమకు వధువులు కావాలని ఆలయానికి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.


మాండ్య జిల్లాకు చెందిన పలువురు బ్రహ్మచారులు వచ్చే నెలలో పాదయాత్రగా పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. గ్రామాల్లో నివసిస్తున్న రైతులకు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లిళ్లు చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. అమ్మాయిలు కూడా అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడంటే ఆసక్తిని చూపించడం లేదు. చాలా మంది మహిళలు, వారి కుటుంబాలు గ్రామీణ జీవనంలోకి ప్రవేశించడానికి ఇష్టపడకపోవడమే ‘వధువుల కొరత’కు కారణమైందని రైతులు అంటున్నారు.


ఇదే విషయంపై యువ రైతులు మాట్లాడుతూ.. తాము కట్నం ఆశించడం లేదని పైగా తమ భార్యని (కాబోయే భార్యని) రాణుల మాదిరిగా చూసుకుంటామని చెబుతున్నారు. అయినప్పటికీ ఏ కుటుంబం కూడా తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించడానికే ఈ పాదయాత్ర చేపట్టామని సంతోష్ అనే ఓ రైతు అన్నారు. అఖిల కర్ణాటక బ్రహ్మచారుల సంఘం ఆధ్వరంలో ఆదిచుంచనగిరి మఠానికి డిసెంబరులో పాదయాత్రగా వెళ్లనున్నారు.


‘మేము ఆదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానందనాథ స్వామిని కలిశాం.. యాత్రకు సమ్మతించారు.. వధువు సంక్షోభంపై సమాజంలో అవగాహన కల్పించడమే లక్ష్యం’ అని అఖిల కర్ణాటక బ్రహ్మచారుల సంఘం వ్యవస్థాపకుడు కేఎం శివప్రసాద్ అన్నారు. గతంలోనూ కర్ణాటక బ్రహ్మచారులు పెళ్లికోసం పాదయాత్ర చేపట్టారు. మాండ్య ప్రాంతానికి చెందిన సంతోష్ సహా వందల మంది బ్రహ్మచారి రైతులు గత ఫిబ్రవరిలో చామరాజనగర్ జిల్లాలోని ఎంఎం హిల్స్ ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa