ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ.. రంగంలోకి గుహ నుంచి థాయ్ పిల్లలను రక్షించిన సంస్థ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 10:16 PM

ఉత్తరాఖండ్ సొరంగం కూలిన ఘటనలో నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లోపలి చిక్కుకున్న 40 మంది కూలీలను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2018లో గుహ నుంచి థాయ్ పిల్లలను రక్షించిన సంస్థ సాయం తీసుకుంటున్నారు. భారత వైమానిక దళానికి చెందిన మూడు విమానాలు సామాగ్రిని తీసుకొస్తున్నారు. గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించడంలో సహాయం చేసిన వారితో సహా థాయ్‌లాండ్, నార్వేలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.


ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన 900 మి.మీ. వ్యాసం కలిగిన ప్రత్యేక యంత్రం గంటలో 4-5 మీటర్ల శిధిలాలను తొలగిస్తుంది. అన్నీ సక్రమంగా జరిగితే మరో 10-12 గంటల్లో కూలీలు చిక్కుకున్న ప్రదేశానికి రెస్క్యూ పైపు చేరుకుంటుంది. యంత్రం కొద్ది గంటల్లో వచ్చే అవకాశం ఉందని, అది వచ్చిన తర్వాత అమర్చి పనులు ప్రారంభించవచ్చని అధికారులు తెలిపారు. 2018లో ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్‌ గుహలో జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టును చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని రక్షించడంలో సహాయం చేసిన థాయ్‌లాండ్‌కు చెందిన ఒక కంపెనీని రెస్క్యూలో పాల్గొన్న బృందాలు సంప్రదించాయి. 10 వేల మంది సిబ్బంది పాల్గొన్న ఆ రెస్క్యూకి వారం రోజులు పట్టింది. ఆ కంపెనీ నైపుణ్యం చాలా గొప్పదని అధికారులు తెలిపారు.


సొరంగం లోపల కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో సూచనల కోసం నార్వేజియన్ జియోటెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కూడా సహాయం తీసుకున్నారు. ఇటువంటి సూచనలు భారతీయ రైల్వేలు, దానికి అనుబంధంగా ఉన్న రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్,ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి నిపుణుల నుంచి కూడా తీసుకుంటారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్ఖో మాట్లాడుతూ.. ‘ఆ యంత్రం త్వరలోనే చేరుకోనుంది.. మూడు-నాలుగు గంటల్లో, మేము దానితో పనిని ప్రారంభించగలం... శిధిలాలు తొలగిస్తున్నాం.. అయితే వాటిలో కొన్ని పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము పైపును నెట్టడానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.


కొత్త యంత్రం పైపును గంటలో 3-4 మీటర్లు నెట్టగలదు.. మేము 10-12 గంటల్లో పనిని పూర్తి చేయగలము, అయితే లోపల ఏ యంత్రాలు ఇరుక్కుపోయాయనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. కార్మికులు బాగానే ఉన్నారు.. వారికి ఆహారం, ఆక్సిజన్ అందుతోంది.. వారిలో మనోధైర్యాన్ని నింపడానికి కుటుంబాలు, అధికారులు వారితో మాట్లాడుతున్నారు’ అని తెలిపారు. ఈ యంత్రం పనిచేయకపోయినా తమ వద్ద ప్లాన్-బి ఉందని, రెస్క్యూ‌కు సమయాన్ని నిర్దేశించడం చాలా కష్టమని ఖల్దో చెప్పారు. కార్మికుల కుటుంబాల మాదిరిగానే మేమంతా ఆందోళన చెందుతున్నామని, మా సోదరులను రక్షించే వరకు ఎవరూ విశ్రమించేది లేదని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa