ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఇళ్ల లబ్ధిదారులపై భారం పడకుండా అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ప్రభుత్వం భరించే వడ్డీ మొత్తాన్ని జమ చేసేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు.
హౌసింగ్ కింద ఇళ్లనిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన అక్టోబరులో 7.43 లక్షల ఇళ్లను ఇప్పటికే అక్కచెల్లెమ్మలకు అందించామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నాటికి మరో 6 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. వీటికి సంబంధించిన పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని.. అలాగే అక్టోబరులో లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై నిశితంగా పరిశీలన చేశామన్నారు. కరెంటు, తాగునీరు సదుపాయాలను కల్పించామని.. మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు అధికారులు.
ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు పూర్తిచేసుకున్న ప్రతి ఇంటినీ ఆడిట్ చేసి సదుపాయాలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై ఆడిట్ నిర్వహించాలన్నారు. కరెంటు, తాగునీరు, సోక్ పిట్స్ ఉన్నాయా? లేవా? అన్నవాటిపై ఆడిట్ చేయించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటిరకూ 12,72,143 మంది అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇచ్చామన్నారు.
అక్క చెల్లెమ్మలు రూ.4,483 కోట్ల రుణాలు అందుకున్నారని.. పావలా వడ్డీ రుణాలపై చెల్లించాల్సిన మిగిలిన వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం జగన్. లబ్ధిదారులతో ఏర్పాటుచేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని.. ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్నదానిపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారని.. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa