ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ను సీబీఐ, ఈడీ కనీసం సవాలు చేయలేదని రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని.. అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత.. దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును రఘురామ కోరారు. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. అంతేకాదు ఎంపీ రఘురామ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో ఆలస్యం అవుతోందని.. జగన్ కేసును 3071 సార్లు సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్లో ప్రస్తావించారు. ఈ కేసుల విచారణ సందర్భంలో జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్ది డిశ్చార్జి పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. సీఎం జగన్ కేసుల్లో జాప్యం ఎందుకు జరగుతోందని ప్రశ్నించింది. ఆలస్యానికి కారణాలు ఏంటో చెప్పాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐతో పాటుగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేవించిన ధర్మాసనం.. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జనవరికి వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa