తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు.ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను విరాళంగా అందించారు. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఎపీఎస్ఈబీ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
ఈ విద్యుత్ గాలిమర ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన ప్రతి ఏడాది టీటీడీకి రూ.కోటి ఆదా అవుతుంది. కాగా ఇప్పటికే టీటీడీ అవసరాలకు 15 ఏళ్ల క్రితమే ఈ కంపెనీ వారు 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలి మర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ వారే చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 0.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమర నిర్వహణను కూడా వీరే చూడనున్నారు.ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, సీఈ నాగేశ్వరరావు, ఎస్ ఈ -2 జగదీశ్వర్ రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి, ఈఈలు సురేంద్ర నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ బి.రవిచంద్రన్ పర్యవేక్షణలో డీఎస్పీ బి.కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై ఆలయ సిబ్బందికి, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.
పాంచరాత్ర ఆగమం ద్వారా భగవంతుని లీలావిశేషాలను అవగతం చేసుకోవచ్చని, ఆలయ కైంకర్యాలకు ఇది మార్గదర్శనంగా నిలుస్తోందని మేల్కొటెకి చెందిన శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, భగవత్శాస్త్ర పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ సంయుక్త ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో అఖిల భారత భగవత్శాస్త్ర పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి వచ్చారు. పాంచరాత్ర ఆగమంలో లో భగవదారాధన ఎంతో విశేషమైనదని, ఆలయం నిర్వహణకు సంబంధించిన సమస్త విషయాలు ఇందులో ఉన్నాయని తెలియజేశారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్రీ అనంత వెంకట దీక్షితులు మాట్లాడుతూ ఈ ఆగమంలోని నిగూఢమైన విషయాలను వేద, ఆగమ విద్యార్థులు అవగాహన చేసుకుని, పాంచరాత్ర ఆగమాన్ని విశ్వవ్యాప్తం చేయాలని కోరారు.
శ్రీరంగం శ్రీ పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ నిర్వాహకులు శ్రీ రామభట్టర్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన ఎన్నో విషయాలు పాంచరాత్ర ఆగమంలో ఉన్నాయని, ఇది చతుర్వేదాలకు, సకల శాస్త్రాలకు మూలమని తెలియజేశారు. అనంతరం శ్రీరంగం శ్రీ పాంచరాత్రాగమ సంరక్షణ సభ కార్యదర్శి శ్రీ జయపాల్ దంపతులను స్వామీజీ ఘనంగా సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa