బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫానుగా బలపడి.. కోస్తాంధ్ర తీరంవైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఇది ఒక సవాలు లాంటిందని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
పంట కోతకు వచ్చే సమయంలో తుఫాను ముంచుకురావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడాలని అధికారులకు జగన్ సూచించారు. పొలాల్లో కోయని పంటను అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కోసినట్లయితే ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఒక్కరోజే 97 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని భద్రపరిచామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
వర్షాల కారణంగా ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను తీవత్ర తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం చెల్లించాలని సూచించారు. మరోవైపు, తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు తీరప్రాంతాల్లో తీవ్రస్థాయిలో అలజడి నెలకుంది. ముంగినపూడి బీచ్లో సముద్రం 100 మీటర్ల మేర ముందుకొచ్చింది. పలు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సూళ్లూరుపేట, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె మండలాల్లోని తీర ప్రాంతాలకు సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. పలు పోర్టులో ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, , కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.
మిచౌంగ్ ప్రభావంతో గడచిన 24 గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. తిరుపతి పూలతోట వద్ద 30 సెం.మీ., అల్లంపాడు వద్ద 26 సెం.మీ., నెల్లూరులో 25.4 సెం.మీ వర్షపాతం, నాయుడుపేటలో 24 సెం.మీ, నెల్లూరు గాంధీనగర్లో 22 సెం.మీ., కట్టువపల్లేలో 21 సెం.మీ., వెంకటాచలంలో 19.7 సెం.మీ., చిట్టేడులో 19 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తిరుమలలో గోగర్బం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa