ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం

national |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 10:31 PM

ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఉజ్వల భవిష్యత్తుకు ఒక ఆశాకిరణం అని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రజల కలలు, ఆశలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.


ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు గురించి ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 2019 ఆగస్టు 5 వ తేదీన భారత పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న సోదరసోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే తీర్పు అని హర్షం వ్యక్తం చేశారు. భారతీయులుగా మనం ఎంతో గర్వపడే ఐక్యతను సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసిందని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్‌ ప్రజల కలలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం చట్టపరమైంది మాత్రమే కాదని.. భవిష్యత్ తరాలకు ఇదో ఆశాకిరణం లాంటిదని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని.. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనమని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆర్టికల్‌ 370 రద్దు పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పేదలు, అణగారిన వర్గాల హక్కులను పునరుద్ధరించగలిగామని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో వేర్పాటువాదం, రాళ్ల దాడుల ఘటనలు ఇక గతమే అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత నేడు మరింత బలపడిందని అమిత్ షా తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా జమ్మూ కాశ్మీర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ సర్కారు ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు.


ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతకంటే ముందే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని సూచించారు. అయితే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్‌లోని ప్రాంతీయ పార్టీలైన ఆజాద్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పెదవి విరిచాయి. ఈ తీర్పు విచారకరమని.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు సంతోషంగా లేరని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులామ్‌ నబీ ఆజాద్‌ చెప్పారు. అయినప్పటికీ సుప్రీం ఇచ్చిన తీర్పును మనం అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ తీర్పుతో అసంతృప్తిగా ఉన్నామని.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. అయినా దీంతో తాము నిరుత్సాహపడట్లేదని చెప్పారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి బీజేపీకి కొన్ని దశాబ్దాలు పట్టిందని.. తాము కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధం అవుతున్నామని.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa