ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. మొత్తం 12కు చేరిన కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2023, 07:29 PM

ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం 12 ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో 13 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో 5, విశాఖలో 3, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 1, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 2 కేసులు బయటపడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆసుపత్రిలో ఓ రోగికి సర్జజీ చేసే ముందు అనుమానిత లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని పాసర్లపూడిలంకలో ఓ గర్భిణికి కొవిడ్‌ సోకింది. ప్రస్తుతానికి బాధితుల్లో ఎక్కువ మంది ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు. విశాఖ నగర పరిధిలో గురువారం 21 మందికి, కాకినాడ జీజీహెచ్‌లో శుక్రవారం 26 మందికి కరోనా పరీక్షలు చేశారు. కేసుల సంఖ్య దృష్ట్యా విశాఖలో పరీక్షలూ పెంచుతున్నట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బుచ్చిరాజు తెలిపారు. ఆయా కేసుల్లో వేరియంట్‌ తెలుసుకునేందుకు పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు.


మరోవైపు కొవిడ్‌–19 వ్యాప్తి నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుచర్యలు చేపట్టింది. అన్ని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు వందేసి చొప్పున ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను పంపిణీ చేస్తున్నారు. తీవ్ర తలనొప్పి, దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫ్లుయింజా లక్షణాలతో ఆస్పత్రి అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) విభాగాలకు వచ్చే రోగులకు, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో వచ్చే రోగుల నుంచి శ్వాబ్‌లను సేకరించి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లతో కరోనా టెస్టులు చేయాలని ఆదేశించారు. ఈ టెస్టుల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయిన రోగుల శాంపిల్‌ను కొవిడ్‌ వేరియంట్‌ తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపాలని సూచించారు. తీవ్రత బట్టి శాంపిల్‌ను ఆర్టీపీసీఆర్‌ టెస్టులకు పంపాలని అధికారులు కోరారు. అన్ని ఆస్పత్రుల్లోను గతంలో మాదిరిగానే కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ను పాటించాలన్నారు.


విశాఖలో మూడు కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుల కోసం కేజీహెచ్‌లో 160 ఆక్సిజన్‌, వెంటిలేటరు పడకలను సిద్ధం చేశారు. అవసరమైన మందులు, సెలైన్‌ బాటిల్స్‌ అందుబాటులో ఉన్నాయుని చెప్పారు. ఎన్ని కేసులు వచ్చినా మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మరో పక్క నిర్ధారణ పరీక్షల సంఖ్యలు పెంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో సైతం రాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. అక్కడ పాజిటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసి కొవిడ్‌ను నిర్ధారిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.


కోవిడ్‌ వైరస్‌ బారినపడిన వారిలో పొడి దగ్గు, తుమ్ములు, ఒళ్లు నొప్పులు, బలహీనత, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా లక్షణాలతో మూడు నుంచి ఐదు రోజులపాటు బాధపడుతూ మందులు వాడుతున్నా ప్రయోజనం లేకపోతే కరోనా నిర్ధారిత పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. జన సమర్థంగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, మాస్క్‌ ధరించడం, చేతులు తరచూ శుభ్రపరుచుకోవడం, వ్యాధి లక్షణాలు ఉంటే సకాలంలో పరీక్ష చేయించుకుని వైద్య సేవలు పొందడం చేయాలంటున్నారు. కొత్త వేరియంట్‌ కొంత ఇబ్బందికరమైనది అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa