ఏళ్లుగా టీటీడీ నిధులను తిరుపతిలో పారిశుధ్యం, ఇతర పనులకు వినియోగిస్తున్నామని, ఇదే మొదటిసారి కాదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ఈవో ధర్మారెడ్డి హైకోర్టుకు నివేదించారు. భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే టీటీడీ దేవస్థానాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, టీటీడీ ఆస్పత్రులు, విద్యాసంస్థల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. పారిశుధ్య పనులకు సహకారం అందించాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ కోరిన మీదట పాలకమండలిలో చర్చించి సహకారం అందించాలని తీర్మానం చేశారని వివరించారు. తిరుపతికి వచ్చే భక్తుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతి నగరంలోని రోడ్డు విస్తరణ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, మంచినీటి సరఫరా కోసం గతంలోనూ నిధులు ఇచ్చామన్నారు. కేవలం రాజకీయ, స్వీయ ప్రయోజన దృష్టితోనే పిటిషనర్ పిల్ దాఖలు చేశారని పేర్కొన్నారు. భారీ జరిమానా విధించి వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్లోని రోడ్లు, కాలనీల పారిశుధ్య పనులకు వినియోగించే విషయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, టీటీడీ ఈవో వేసిన కౌంటర్కు రిప్లై వేసేందుకు సమయం ఇవ్వాలన్న పిటిషనరు తరఫు న్యాయవాది అభ్యర్థనకు హైకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. విచారణను మూడువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa