వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చని.. ఆమె వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వచ్చే నష్టం ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కచ్చితంగా ఉన్నారని అందుకు తమ దగ్గర చాలా ఆధారాలున్నాయన్నారు. సీఎం రమేష్కు సంబంధించిన సొంత విమానంలోనే షర్మిల, బ్రదర్ అనిల్ ఢిల్లీకి వెళ్లారని.. ఎయిర్పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేత బీటెక్ రవిని బ్రదర్ అనిల్ కలవడం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు. అంతకు ముందు బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చంద్రబాబు చర్చలు జరిపారని సజ్జల ప్రస్తావించారు.
బ్రదర్ అనిల్పై విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు అదే అనిల్ పక్కనే నిలబడి ఫొటోలు దిగుతున్నారని సజ్జల తెలిపారు. దీన్ని బట్టే టీడీపీ నేతల పన్నాగాన్ని అర్థం చేసుకోవచ్చాన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందుల నుంచి విజయమ్మకు పోటీగా బరిలోకి దింపిందని సజ్జల గుర్తు చేశారు. వైఎస్సార్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు అర్థం అయిందని.. అందుకే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను డైవర్ట్ చేయడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసే ఆ రోజు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు మోపాయన్నారు. కాంగ్రెస్ నేతగా, ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్సార్ చనిపోయారని గుర్తు చేశారు. వైఎస్ చనిపోయాక పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీకి దిగితే.. ఆమెకు పోటీగా వివేకానందరెడ్డికి కాంగ్రెస్ బరిలోకి దింపిందని తెలిపారు. కాంగ్రెస్తో ఎప్పటి నుంచో చంద్రబాబు కాంటాక్ట్లో ఉంటున్నాడన్నారు. చంద్రబాబు తనకేం కావాలో ఓ కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడని ఆరోపించారు. కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు సజ్జల. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. ఆ పార్టీని తాము అసలు పట్టించుకోమని.. పట్టించుకునే పరిస్థితులు కూడా లేవన్నారు సజ్జల. ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే సీఎం జగన్.. ప్రజలే అంటారని చెప్పుకొచ్చారు. కుటుంబం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టలేదన్నారు. ఒక పార్టీగా తమ విధానాలు తమకు ఉన్నాయంటూ సజ్జల కీలక కామెంట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa