సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నాట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో కీలక అంశాలను తెలిపారు. అయోధ్యలో జనవరి 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో టికెట్ (రూ.300/-) కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.. టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ‘‘శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో.. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు. తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు నేటి నుంచి ముగిశాయి. గత ఏడాది డిసెంబర్ 12న వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు ప్రతి రోజు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు. అధ్యయనోత్సవాల్లో తొలి 11 రోజులను పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. కాగా, 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది జరిగాయి. 24వ రోజైన గురువారం శ్రీ వరాహస్వామివారి ఆలయంలో సాత్తుమొర నిర్వహించారు. 25వ రోజైన శుక్రవారం తణ్ణీరముదు ఉత్సవంతో ఈ అధ్యయనోత్సవాలు ముగిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa