ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాల్దీవులు టార్గెట్‌గా మోదీ సర్కారు మాస్టర్ ప్లాన్..! భారతీయుల దెబ్బకు దిగొచ్చిన మాలె

national |  Suryaa Desk  | Published : Sun, Jan 07, 2024, 10:39 PM

మహ్మద్ ముయిజ్జూ అధ్యక్షతన మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత.. ఆ దేశంలో భారత్ వ్యతిరేక వైఖరి ఎక్కువైన సంగతి తెలిసిందే. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇండియా ఔట్ నినాదంతో మహ్మద్ ముయిజ్జూ ప్రచారం నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే.. మాల్దీవులు నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముయిజ్జూ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మాల్దీవుల నుంచి భారత సైన్యం వెనక్కి వెళ్లాలని కోరారు. అయితే చాలా ఏళ్లపాటు ఇండియా ఫస్ట్ వైఖరితో ఉన్న మాల్దీవులు.. ఇటీవల చైనా జోక్యంతో భారత్‌కు దూరం జరగడం మొదలుపెట్టింది. తమది గణతంత్ర దేశమని.. తమ అంతరంగిక విషయాల్లో ఏ దేశం జోక్యాన్ని ఒప్పకోమని మాల్దీవులు కొత్త అధినేత చెబుతున్నారు.


దీంతో మాల్దీవులకు చెక్ పెట్టేలా ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించి.. అక్కడి బీచ్‌ల్లో ఫొటోలు దిగిన సంగతి తెలిసిందే. మన లక్షద్వీప్‌.. పొరుగున ఉన్న మాల్దీవులకు ఏమాత్రం తక్కువ కాదని ప్రధాని పర్యటన తర్వాత జనాలు అభిప్రాయపడ్డారు. ఇటీవల మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. భారత పర్యాటకులు మాల్దీవులను కాదని.. లక్షద్వీప్‌ వైపు ఆకర్షితులయ్యే సూచనలు కనిపించాయి. లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ దిగిన ఫొటోలు వైరల్ కావడంతో.. భారత్ ఆంతర్యం అర్థమైన మాల్దీవుల ప్రభుత్వ ఉలిక్కి పడింది. మాల్దీవుల మంత్రి మరియమ్ షియునా ప్రధాని మోదీని కించపరిచేలా ట్వీట్ చేసింది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు భారతీయులకు ఆగ్రహం కలిగించాయి. మరియమ్ షియునా.. మోదీని గేలి చేస్తూ ట్వీట్ చేసిన కాసపేటికే భారతీయుల నుంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లింది. పెద్ద ఎత్తున భారతీయులు తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఉలిక్కి పడిన మాల్దీవులు ప్రభుత్వం.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని తెలిపింది.


మాల్దీవులు అనేది హిందూ మహా సముద్రంలోని అనేక ద్వీపాల సముదాయం. 5 లక్షల జనాభా ఉన్న ఈ దేశ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు మాల్దీవులు వెళ్తుంటారు. ఆ తర్వాత రష్యా, చైనా, యూకే, జర్మనీ, ఇటలీ దేశాలకు చెందిన పర్యాటకులు ఉంటారు. 2023లో డిసెంబర్ 13 నాటికి భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులు వెళ్లారు. రష్యా నుంచి 2,09,146 మంది.. చైనా నుంచి 1,87,118 మంది, యూకే నుంచి 1.55 లక్షల మంది, జర్మనీ నుంచి 1.35 లక్షల మంది మాల్దీవులను సందర్శించారు. ఒకవేళ భారతీయులు గనుక మాల్దీవులు వెళ్లడం మానేస్తే.. ఆ దేశ పర్యాటక రంగంపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను సందర్శించిన తర్వాత.. భారత్‌లో ఇప్పటి దాకా ప్రాచుర్యంలోకి రాని బీచ్‌లను వెతికి బయటకు తీసే పనిలో జనాలు పడ్డారు. మన దగ్గరే బోలెడన్ని బీచ్‌లు ఉండగా.. మాల్దీవులకు వెళ్లడం దేనికి అనేది దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తానికి చైనాతో చెలిమి చేస్తూ.. భారత్‌ను ఇరుకున పెట్టాలని చూస్తున్న మాల్దీవులకు ఇండియన్స్ టూరిజం రూపంలో ఓ ఝలక్ ఇస్తున్నారన్నమాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa