కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మండల-మకరు విళక్క పూజలు ముగిశాయి. దీంతో శనివారం పడిపూజ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. గతేడాది నవంబరు 16న అయ్యప్ప ఆలయాన్ని మండల పూజల కోసం తెరిచి, నవంబరు 17 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. మండల పూజల అనంతరం మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి.. తిరిగి డిసెంబరు 30న మకరు విళక్కు కోసం దర్శనాలను ప్రారంభించారు.
కాగా, ఈ సీజన్లో అయ్యప్ప స్వామి ఆలయానికి కనీవినీ ఎరుగుని రీతిలో భక్తులు తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. ఈ సీజన్లో స్వామి దర్శనం కోసం 50,06,412 మంది భక్తులు వచ్చినట్టు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు వెల్లడించింది. గతేడాది 44 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, ఆలయానికి ఆదాయం కూడా భారీగా వచ్చిందని తెలిపింది. మొత్తంగా రూ.357.47 కోట్ల ఆదాయం లభించినట్టు పేర్కొంది. గతేడాది ఇదే సీజన్లో స్వామివారికి రూ.347.12 కోట్ల ఆదాయం వచ్చింది.
స్వామివారి అరవణ ప్రసాదం (బెల్లం పాకంతో కూడిన బియ్యం) విక్రయాలతో రూ.146.99 కోట్లు, అప్పం (బియ్యం పిండి, బెల్లంతో తయారు చేసిన వడలు) అమ్మకాలతో రూ.17.77 కోట్ల ఆదాయం వచ్చినట్టు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఛైర్మన్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ సీజన్లో ఆలయం వద్ద భక్తుల రద్దీ నియంత్రణ సహా పలు అంశాల్లో కేరళ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు తీవ్ర ఆరోపణలను, విమర్శలను ఎదుర్కొంది. భక్తులకు అనుగుణంగా టాయ్లెట్స్, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైంది. భక్తులు కూడా అనేక చోట్ల ఆందోళనలు, నిరసనలు దిగిన సందర్బాలూ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa