అనకాపల్లి జిల్లాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన వాహనాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు పట్టుబడింది. నక్కపల్లి మండలం కాగిత టోల్ప్లాజా దగ్గర రెండు వారాల నుంచి పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. విధుల్లో భాగంగా శనివారం రాత్రి సిబ్బందితో కలిసి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేశారు. కారులో కొన్ని మూటలు కనిపించాయి. పోలీసులు అనుమానంతో వాటిని బయటకు తీసి చెక్ చేశారు. ఆ మూటల్లో కట్టిన డబ్బుల్ని గుర్తించారు. కరన్సీ తరలింపునకు సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లు అడిగారు. ఇదంతా ధాన్యం క్రయ విక్రయాలకు సంబంధించి డబ్బులని.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి తీసుకెళ్తున్నట్లు ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు, డ్రైవర్ యాదవ రాజు తెలిపారు. వీటిని మధ్యవర్తుల సమక్షంలో లెక్కించగా రూ. రెండు కోట్ల ఏడు లక్షల 50 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ డబ్బులకు సరైన ఆధారాలు లేని కారణంగా ఉన్నతాధికారుల సూచనలతో నగదుతోపాటు, వాహనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదుకు సంబంధించి తగిన ఆధారాలు చూపించి ఆదాయ పన్నుశాఖ అధికారుల నుంచి తీసుకోవచ్చని.. డబ్బుల్ని తరలిస్తున్న వెంకటేశ్వరరావుకు పోలీసులు తెలిపారు. ఎవరైనా డబ్బుల్ని తరలిస్తుంటే.. వాటికి సంబంధించిన పత్రాలను కచ్చితంగా వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa