అయోధ్య రామమందిరంలో బాల రాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవం మొదలైంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు 45 రోజులపాటు కొనసాగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని.. దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడి పాదాల చెంత ‘రాగ సేవ’ అందిస్తారన్నారు.
వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, హేమామాలిని, అనూప్ జలోటా, మాలిని అవస్థీ, సురేశ్ వాడ్కర్, అనురాధ పౌడ్వాల్, సోనాల్ మాన్సింగ్ వంటి ప్రముఖులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 50 సంగీత వాయిద్యాలు మంగళ ధ్వనిలో భాగం కానున్నాయి అన్నారు. ఈ వేడుకకు యతీంద్ర మిశ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా, ఢిల్లీ సంగీత నాటక అకాడమి సహకరిస్తోంది.
మాలినీ అవస్థీ ‘సోహర్’, ‘బధవ’, ‘మంగళ్ గాన్’ వంటివి ఆలపిస్తారు. బసంతి బిష్త్, ప్రేరణ శ్రీమాలి, సునంద శర్మ, మీటా పండిత్, పద్మా సుబ్రహ్మణ్యం కూడా గాన కచేరి చేయనున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవంలో ప్రతిధ్వనించిన ‘మంగళ్ ధ్వని’కి యతీంద్ర మిశ్రా ఆధ్వర్యం వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏభై సాంప్రదాయక సంగీత పరికరాలను ఆ కార్యక్రమంలో ఉపయోగించారు. ‘మంగళ్ ధ్వని’కి ముందు సోనూ నిగమ్, అనూరాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్ శ్రీరాముని నుతిస్తూ పాటలు పాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa