తిరుపతి జిల్లాలో పది రోజుల కిందట జరిగిన కారు చోరీ కేసులో దర్యాప్తు చేస్తుండగా మర్డర్ మిస్టరీ బయటపడింది. చంద్రగిరి మండలం తొండవాడ విల్లాస్లో 10 రోజల కింద కారు చోరీకి గురయ్యింది. దీంతో కారు యజమాని రవీంద్ర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దొంగలను పట్టుకున్నారు. అయితే, విచారణలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించడంతో పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది. తాము కారు దొంగిలించలేదని తెలిపారు. రవీంద్ర రెడ్డి చేసిన హత్యకు సహాయం చేశామని, డబ్బులు ఇవ్వకపోవడంతో కారు ఎత్తుకెళ్లామని చెప్పారు.
తీగ లాగితే కదిలినట్టు కారు చోరీ కేసులో విచారణ చేపడితే హత్య కేసు బయటపడింది. అనంతపురం పట్టణానికి చెందిన రవీంద్ర రెడ్డి.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జూట్ల జయమ్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కుమారుడు పుట్టిన తర్వాత మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో జయమ్మ వదిలేసి.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం తర్వాత చంద్రగిరి మండలం తొండవాడకు మకాం మార్చిన రవీంద్ర రెడ్డి.. పక్కనే ఉన్న బుచ్చినాయుడు పల్లెలో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం చేస్తున్నాడు.
అయితే, రవీంద్ర రెడ్డి తొండవాడలో ఉన్న విషయం మొదటి భార్య జయమ్మకు తెలియడంతో ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. గత ఏడాది మే 25న తొండవాడకు వచ్చిన ఆమెతో.. పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవేశంలో జయమ్మను కొట్టి చంపాడు. పౌల్ట్రీ వద్ద పని చేస్తున్న వారితో కలిసి మృతదేహాన్ని రాజంపేట ప్రాంతంలో రవీంద్ర రెడ్డి పాతిపెట్టాడు.
కాగా, జయమ్మ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె సోదరుడు దేవేంద్ర అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో జూన్ 3న ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో పది రోజుల కిందట రవీంద్ర రెడ్డి కారు చోరీకి గురికావడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. రవీంద్ర రెడ్డి సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజంపేట ప్రాంతంలో పాతిపెట్టిన జయమ్మ మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. హత్య జరిగి 8 నెలలు గడుస్తుడడంతో పాతిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa