ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుండగా.. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఎస్జీటీలకు డీఎల్ఈడీ (డీఎడ్) అభ్యర్థులే అర్హులని స్పష్టం చేసింది. రాజస్థాన్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు అనుగుణంగా ప్రాథమిక తరగతులకు బోధించడానికి బీఈడీ అభ్యర్థులు అర్హులు కాదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
బీఎడ్ చేసిన అభ్యర్థులు కూడా ఎస్జీటీలకు అర్హులేనని జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి (ఎన్సీటీఈ) అనుమతించింది. దీంతో రాజస్థాన్కు చెందిన కొందరు హైకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. హైకోర్టు తీర్పును సమర్ధించింది. బీఈడీ అర్హత ఉన్నవారు మాధ్యమిక పైతరగతులకే బోధించడానికి అర్హులని తుది తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా టెట్ ఎవరు రాయాలనే అర్హతలపై రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది.
ఎస్టీజీలకు సంబంధించిన టెట్ పేపర్-1కు డీఈడీ చేసినవారు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన పేపర్-2ను బీఎడ్ చేసిన అభ్యర్థులు రాయాలని వెల్లడించింది. ఇక, పేపర్-2లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల శాతంలో సడలింపు ఇచ్చింది. బీఎడ్లో ప్రవేశానికి ఢిగ్రీలో 40 శాతం మార్కులు ఉండాలి. కానీ, టెట్ రాయాలంటే డిగ్రీలో 45 శాతం మార్కులుండాలనే నిబంధన ఉంది. దీనిని సడలించాలని కొంతకాలంగా అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో డిగ్రీలో 40 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్-2 రాసేందుకు సడలింపునిచ్చింది. అయితే ఇది ఈ ఒక్కసారికే వర్తిస్తుందని స్పష్టంచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa