ఢిల్లీలో ఏపీకి చెందిన ఓ మహిళ హోటల్లో బస చేసి బిల్లు కట్టే సమయంలో బురిడీ కొట్టించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్మాన్ హోటల్లో ఝాన్సీరాణి గత డిసెంబర్లో 15 రోజులు ఉండడానికి గదిని బుక్ చేశారు. మొత్తం రూ.5,88,176లు బిల్ అయ్యింది. ఆమె హోటల్ను విడిచివెళ్లే సమయంలో ఓ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పంపినట్లు సిబ్బందికి చూపించారు. బ్యాంకు అకౌంట్లో మాత్రం డబ్బులు పడకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపి జనవరి 13న అరెస్టు చేశారు. ఆమె ఉపయోగించిన అకౌంట్ నకిలీదని తేలింది. హోటల్లో స్పా సౌకర్యం కోసం ఆమె ఏకంగా రూ.2.11 లక్షలను ఖర్చు చేశారని.. ఆమె పేరును ఇషా దేవ్గా నకిలీ ఐడెంటిటీ కార్డును చూపించినట్లు పోలీసులు తెలిపారు. మోసం కేసులో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. విచారణలో సదరు మహిళ బ్యాంకు ఖాతాలు ఇవ్వడంలో సహకరించలేదన్నారు. ఢిల్లీ పోలీసులు ఆమె పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. తాను, తన భర్త డాక్టర్లమని, న్యూయార్క్లో ఉంటామని విచారణలో చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయం సమీపంలో మహిళ అన్నిరోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందో విచారణ చేస్తున్నామన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆమె బ్యాంకు అకౌంట్లో కేవలం రూ.41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa