ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రత అంశం చర్చనీయాంశం అవుతోంది. 20 ఏళ్లగా కొనసాగుతున్న భద్రతను జగన్ సర్కార్ మాత్రం తగ్గించింది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే షర్మిలకు సెక్యూరిటీ విషయంలో డీజీపీకి కాంగ్రెస్ పార్టీ తరఫున లేఖ కూడా రాశారు.. భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. అయితే ఈ లేఖపై ఇప్పటి వరకు డీజీపీ, ప్రభుత్వం స్పందించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.
'చీప్ రాజకీయాలు చేయడం వైఎస్సార్ స్టైల్ కాదు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. దీనికి మరో ఉదహరణ.. వైఎస్ షర్మిలకు 2004 నుంచి 4+4 గన్మెన్లతో భద్రత ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు ఆ సెక్యూరిటీని కొనసాగించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆ భద్రతను తొలగించారు. ఇప్పటికే వైఎస్ షర్మిల జనవరి 22న ఏపీ డీజీపీకి లేఖ రాశారు.. ఇప్పటి వరకు సమాధానం లేదు. నేను గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు ఇదే అంశంపై లేఖ రాస్తున్నాను. వెంటనే గవర్నర్ స్పందించి వైఎస్సార్ కుమార్తె షర్మిలకు భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాను' అంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు.
గవర్నర్కు రాసిన లేఖలో కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. వైఎస్ షర్మిల నూతనంగా బాధ్యతలు స్వీకరించారని గుర్తు చేశారు. ఆమెకు ఉన్న సెక్యూరిటీని 1+1కు పరిమితం చేశారని.. ఆమెకు భద్రతపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. అలాగే షర్మిల పార్టీ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. కాబట్టి ఆమెకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే షర్మిల భద్రతను వెంటనే 4+4కు పెంచాలని కోరారు. వెంటనే స్పందించి.. వీలైనంత త్వరగా ఆమెకు భద్రతను పెంచేలా అధికారులకు ఆదేశాలు ఇస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రతపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి దృష్టికి తెచ్చారు. వైఎస్ షర్మిలకు 4+4 సెక్యూరిటీ ఉండేదని.. ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్న ఈ తరుణంలో 1+1కు తగ్గించారన్నారు. కార్యకర్తల సమావేశాల కోసం ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తున్నారని.. ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. అత్యవసరంగా ఆమె కోరినట్టు.. 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు డీజీపీకి గత నెల 22న లేఖ కూడా రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa