ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులపై కోపంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 08:24 PM

చెప్పిన మాట వినకపోతే ఎవరికైనా కోపమొస్తుంది. పిల్లలు మాట వినకపోతే పెద్దలు, మందలిస్తారు, దెబ్బలు కూడా వేస్తారు. మరి అధికారులు మాట వినకపోతే? సామాన్యులు నెత్తి బాదుకుంటారు. అధికారులు చివరకు ఎమ్మెల్యేల మాట కూడా వినపోతే ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి, అడ్డంగా, ఏటవాలుగా, నిలువుగా నరుక్కొచ్చి పని చేయించుకుంటారు. కానీ ఆ రాష్ట్రంలోని  అధికారులు మాత్రం తెగ మొండిఘటాలు. అందుకే ఎమ్మెల్యే విసుగెత్తి రాజీనామా చేశాడు.


బిహార్‌లో జరిగిందీ సంఘటన. అధికార జేడీయూకి చెంది  బర్హారియా నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామ్ బహదూర్ సింగ్ .. అధికారులు తన మాటను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కూడా చివరి నమస్కారం పడేసి, రాజీనామా లేఖ సమర్పించారు. ‘నేను ఎవర్ని అనే సందేహం వస్తోంది. అధికారులు ఎవరూ నన్ను ఖాతరు చేయడం లేదు. నేను పంపుతున్న ఫిర్యాదులను చెత్తబుట్టలో పడేస్తున్నారు. బార్తారియాలో  ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. పోలీసులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా బాధిత ప్రజలపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అలాంటప్పుడు నాకు పదవి ఎందుకు? అందుకే తప్పుకుంటున్నా.. నేను కేవలం అధికారుల తీరును జీర్ణించుకోలేకనే రాజీనామా చేస్తున్నాను.. ఏ పార్టీలోనూ చేరను..’ అని మీడియాకు తెలిపారు. కాగా, బహదూర్ నిజాయతీగల నేత అని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని జేడీయూ నేతలు చెబుతున్నారు. అయితే ఆయనవన్నీ డ్రామాలు అని విపక్షాలు కొట్టిపడేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa