పార్లమెంటులో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. కేంద్ర ప్రభుత్వం ఒక మతానికి, వర్గానికి ప్రభుత్వమా లేక దేశం మొత్తానికి ప్రభుత్వమా అని విరుచుకుపడ్డారు. తనకు రాముడంటే గౌరవమని పేర్కొన్న ఓవైసీ.. తాను బాబర్, జిన్నా, ఔరంగాజేబు ప్రతినిధిని కాదని స్పష్టం చేశారు. దేశానికి మతం లేదని తాను నమ్ముతున్నానని.. అలాంటిది జనవరి 22 వ తేదీన జరిగిన అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా ఒక మతంపై మరొక మతం గెలిచిందని.. కేంద్ర ప్రభుత్వం సందేశాన్ని ఇవ్వాలి అని అనుకుంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా అయోధ్య రామ మందిరం గురించి జరిగిన చర్చలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి సంబంధించిందా లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా అని నిలదీశారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదని తేల్చి చెప్పారు. దేశానికి మతం లేదని తాను భావిస్తున్నానని.. రామ మందిర ప్రారంభోత్సవం ద్వారా ఒక మతం మరొక మతంపై గెలించిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో దేశంలో ఉన్న 17 కోట్ల మంది ముస్లింలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తాను బాబార్, మహ్మద్ అలీ జిన్నా, ఔరంగాజేబు ప్రతినిధినా అంటూ ప్రశ్నించారు. తాను రాముడిని గౌరవిస్తానని.. అయితే అదే సందర్భంలో తాను నాథురామ్ గాడ్సేను ద్వేషిస్తానని స్పష్టం చేశారు. ఎందుకంటే "హే రామ్" అంటూ చివరి మాటలు మాట్లాడిన మహాత్మాగాంధీని నాథూరామ్ గాడ్సే చంపాడని అసదుద్దీన్ తెలిపారు.
ఇక మితవాద సంస్థలు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేసిన 1992 డిసెంబర్ 6 వ తేదీ తర్వాత దేశంలో మతపరమైన అల్లర్లు చెలరేగాయని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆ సమయంలో యువకులుగా ఉన్న వారిని జైలులో పెట్టారని.. వారు వృద్ధులు అయిన తర్వాత బయటకు వచ్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేతను అప్పటి పార్లమెంటు ఖండించిందని గుర్తు చేశారు. మరోవైపు.. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన ఇద్దరు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులు ఇచ్చిందని ఓవైసీ ఆరోపించారు. ఈ సందర్భంగా తన దృష్టిలో బాబ్రీ మసీదు ఎప్పటికీ అక్కడే ఉంటుందని.. ఉందని పేర్కొన్నారు. ప్రసంగం చివర్లో బాబ్రీ మసీదు జిందాబాద్ అని నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa