ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీటు ఇవ్వకుంటే అధినేతపై ప్రేమ పోరాటం ,,,బుద్ధా వెంకన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 07:14 PM

ఏపీలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. పొత్తుల లెక్కలతో టీడీపీ, జనసేన ఫుల్ బిజిగా ఉండగా.. నియోజకవర్గాల ఇంఛార్జుల ప్రకటన, అసంతృప్తుల బుజ్జగింపులతో వైసీపీ అధిష్ఠానం కూడా బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే మాకు ఈ సీటు కావాలంటే ఈ సీటు కావాలంటూ లీడర్లు ముందుకు వస్తున్నారు. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ గళం విప్పుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన కూటమిలో హాట్‌టాపిక్‌గా మారింది విజయవాడ వెస్ట్ సీటు. ఈ సీటు కోసం టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీపడుతుండగా.. పొత్తులో భాగంగా తనకు అవకాశం ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ కోరుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ లీడర్ బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.


వచ్చే ఎన్నికల్లో పోటీపై టీడీపీ సీనియర్ లీడర్ బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న.. వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఇవ్వదని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను పక్కన పెట్టే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే నాలుకైనా కోసుకుంటా కానీ.. టికెట్ ఇవ్వలేదని చంద్రబాబును విమర్శించనని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించారు.


అయితే బుద్ధా వెంకన్న ప్రకటనతో మెగా బ్రదర్ నాగబాబుకు చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే జనసేన తరుఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేయాలని నాగబాబు భావిస్తున్నట్లు సమాచారం. అన్న కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం ఈ సీటును జనసేనకు కేటాయించాలని చంద్రబాబును కోరుతున్నట్లు తెలిసింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే ఉద్దేశంతోనే నాగబాబు ఇటీవల పాయకరావుపేటలో పర్యటించి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు 2009లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుఫున చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి చేతిలో అల్లు అరవింద్ ఓటమి పాలయ్యారు.


ఇదే సమయంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం కోసం టీడీపీలోనూ తీవ్రమైన పోటీ ఉంది. ఆ స్థానాన్ని తన కొడుకు చింతకాయల విజయ్‌కు కేటాయించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరుతున్నారు. అలాగే వ్యాపారవేత్త దిలీప్ చక్రవర్తి కూడా అనకాపల్లి లోక్‌సభ సీటు చంద్రబాబు తనకే ఇస్తారనే ధీమాతో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో బుద్ధా వెంకన్న అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa