వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా సభలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా రంగంలోకి దిగారు. ఇటీవలే యువగళం పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంఖారావం పేరుతో యాత్ర చేపట్టనున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్రను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజులో విరుచుకుపడ్డారు నారా లోకేష్. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
"ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. అమ్మ ప్రేమకు కండీషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు ఉండవు. ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట, పౌరుషాలకు, పోరాటాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా. అలాంటి ఉత్తరాంధ్రను జగన్ గంజాయి కేంద్రంగా మార్చారు. జగన్ సిద్ధం సభ చూస్తుంటే నవ్వు వస్తోంది.జగన్ ప్రతిదానికి సిద్ధం, సిద్ధం అంటున్నాడు, దేనికి జగన్ సిద్ధం?.. జైలుకు వెళ్లడానికి జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. జైలుకు పంపడానికి మీరు సిద్ధమా?" అంటూ లోకేష్ ఆవేశంగా ప్రసంగించారు.
ప్రతి సభలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ మాట్లాడే జగన్.. ఇన్నేళ్ల పాలనలో వారికోసం ఏం చేశారని ప్రశ్నించారు. మోసానికి, వంచనకు, దగాకు ప్యాంటూ షర్ట్ వేస్తే అది జగన్ అని విమర్శించిన లోకేష్.. 23 వేల డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయ ఖాళీలను తగ్గించారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో మొత్తం లక్షా 70 వేల పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్న లోకేష్... టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీచేస్తామని ప్రకటించారు.
శంఖారావం సభ వేదికగా మరోసారి టీడీపీ సూపర్ సిక్స్ హామీలను లోకేష్ వివరించారు.టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా నిరుద్యోగ భృతి కింద మూడు వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్కూలుకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏటా 15 వేలు ఇస్తామనీ, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున అందించడంతో పాటుగా.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని లోకేష్ టీడీపీ సూపర్ సిక్స్ హామీలను వివరించారు.
రెండు నెలలు ఓపికపడితే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునఃప్రారంభిస్తామన్న నారా లోకేష్.. చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాశామనీ, అధికారంలోకి వచ్చాక న్యాయ విచారణకు ఆదేశించి నిబంధనలు అతిక్రమించిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. శంఖారావం ద్వారా మళ్లీ మనం ప్రతిగడప తొక్కాలన్న నారా లోకేష్.. సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రతిఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa