ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపై తమదైన విశ్లేషణ, అంచనాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరో, నటుడు సుమన్ సైతం తన మనసులో మాటను బయటపెట్టారు.2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సుమన్ తన అంచనాను వెల్లడించారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ, జనసేన కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సుమన్ అన్నారు.తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ అమ్మవారిని ఆదివారం సుమన్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుమన్.. సమకాలీన రాజకీయాలతో పాటు గతంలో ఏం జరిగిందనే విషయాలను సైతం మీడియాతో పంచుకున్నారు.
ఇక రాజకీయాల్లో చంద్రబాబును తన గురువుగా సుమన్ అభివర్ణించారు. గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీగా తనను పోటీ చేయించాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు తాను సుముఖత చెప్పలేదని చెప్పుకొచ్చారు. తనపై నమ్మకంతో ఎంపీ చేయాలనుకున్నారని.. అందుకు తాను చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు సుమన్ చెప్పారు. తాను తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా.. రాజకీయాల్లో ఓనమాలు నేర్పింది మాత్రం చంద్రబాబేనన్నారు. చంద్రబాబుకు పరిపాలన బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా, ఆలోచించి ఓటేయాలని కోరారు.
మరోవైపు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని సుమన్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని తెలిపారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నానన్న సుమన్.. రాజకీయ ఆలోచనలతో విజయ్ అడుగులు వేస్తున్నారని అన్నారు. అలాగే అయోధ్యలో రామప్రతిష్ట గురించి కూడా సుమన్ మాట్లాడారు. బాలరాముడిని దర్శించుకోవటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa