కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సున్నితంగా హెచ్చరించింది. బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని సుతిమెత్తగా మందలించింది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ ‘పనౌటి’ (చెడు శకునం), పిక్పాకెట్ అని సంబోధించారు. ఈ నేపథ్యంలో రాహుల్కు మార్చి 1న ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ఎన్నికల రాజకీయ ప్రసంగాలు హద్దు మీరుతుండటాన్ని గుర్తించిన ఈసీఐ గత వారంలో అన్ని పార్టీలకు సూచనలు చేయడం గమనార్హం.
ప్రసంగించేటప్పుడు రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని సూచించింది. గత ఏడాది రాజస్థాన్లోని జాలోర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీని 'పనౌటీ' అని రాహుల్ గాంధీ సంబోధించారు. అందువల్లే అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిందని దుయ్యబట్టారు. అలాగే, బర్మేర్లో జరిగిన మరో ర్యాలీలో మోదీని పిక్పాకెటర్ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిక్పాకెటర్లు ఒంటరిగా రారని, ముగ్గురు ఉంటారని అన్నారు. ఒకడు ముందు నుంచి, మరొకరు వెనుక నుంచి వస్తే, మూడోవాడు దూరంగా ఉంటాడని చెప్పారు.
హిందూ-ముస్లిం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తుంటారని, అదానీ వెనుక నుంచి వచ్చి డబ్బులు దోచుకుపోతారని రాహుల్ విమర్శించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్లో రాహుల్పై చర్య తీసుకోవాలని ఈసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రాహుల్కు ఈసీ గత వారంలో అడ్వయిజరీ జారీ చేసింది. బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కాగా, 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. ఈ వ్యాఖ్యలతో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయే ముప్పును ఎదుర్కొన్నారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో మళ్లీ పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టగలిగారు. కింది కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించి, జైలు శిక్షను ఖరారు చేయడంతో జిల్లా కోర్టు, హైకోర్టులు ఆ తీర్పును సమర్దించాయి. ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa