సందేశ్ఖాలీ కేసులో నిందితుడు, టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ (Sheikh Shahjahan)ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు సీబీఐకి బుధవారం సాయంత్రం అప్పగించారు. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య రెండు రోజులుగా తలెత్తిన ప్రతిష్టంభనకు తెరపడింది. సాయంత్రం 4.30 గంటల్లోగా సీబీఐకి షాజహాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించాలంటూ కల్కతా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో తాజా పరిణామం చోటుచేసుకుంది. సందేశ్ఖాలీలొ భూ ఆక్రమణలు, మహిళలపై అత్యాచారాలు, ఈడీ అధికారులపై దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా... తక్షణమే విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. దీంతో కేసు బాధ్యతలు చేపట్టిన సీబీఐ మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. కానీ, షేక్ షాజహాన్ను అప్పగించేందుకు సీఐడీ నిరాకరించింది. దీంతో మరోసారి హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.
తమ ఆదేశాలను ధిక్కరించడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కారణ నోటీసులు పంపింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో బుధవారం సాయంత్రం 4.30 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ షాజహాన్ను సీబీఐకి అప్పగించాలంటూ బెంగాల్ సర్కార్ను హెచ్చరించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో షాజహాన్ అప్పగించింది. అంతకు ముందు, ఫిబ్రవరి 29న నిందితుడిని బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. కేసును సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అనంతరం ఈ కేసును సీఐడీ నుంచి సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు ఆదేశాలిచ్చింది.
జనవరి 5న ఈడీ అధికారులపై దాడిచేసిన ఘటనల్లో మూడు ఎఫ్ఐఆర్లను నమోదుచేసిన సీబీఐ.. దర్యాప్తు చేపట్టింది. వందల కోట్ల రేషన్ కుంభకోణం కేసులో అరెస్టైన ఆహార పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్తో షేక్ షాజహాన్కు సంబంధాలున్నాయనే ఆరోపణలపై సందేశ్ఖాలీలో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ సమయంలోనే అధికారులపై దాడులకు పాల్పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa