అయోధ్య రామ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏ ప్రస్తుతం గత కొన్ని రోజులుగా భారతదేశంలో వార్తల్లో నిలుస్తున్నాయి. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వీటి గురించి చర్చ జరుగుతోంది. అయితే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా భారత అంతర్గత వ్యవహారాల గురించి ప్రస్తావించి పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. అయోధ్య రామ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం గురించి పాక్ ఐరాసలో ప్రస్తావించడంతో భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెప్పిందే చెప్పే చెత్త రికార్డు పాకిస్థాన్ సొంతం అని తీవ్రంగా మండిపడింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్ అంబాసిడర్ మునిర్ అక్రమ్ అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ, ఇటీవల భారత్ అమల్లోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. మునిర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు. భారత దేశానికి సంబంధించిన విషయాలపై పాకిస్థాన్ ప్రతినిధి బృందం సంకుచిత, తప్పుదోవ పట్టించే దృక్ఫథాన్ని కలిగి ఉండటం చాలా దురదృష్టకరమని చురకలు అంటించారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్థాయి కలిగిన లోతైన అంశాల గురించి పరిగణిస్తుంటే.. పాక్ దగ్గర నుంచి మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తోందని మండిపడ్డారు. ఎప్పుడూ చెప్పిందే చెప్పే చెత్త రికార్డు కలిగిన పాకిస్థాన్ ప్రతినిధి బృందం.. ప్రపంచం పురోగమిస్తోన్న తరుణంలో స్తబ్ధుగా ఉండటం తీవ్ర విచారకరం రుచిరా కాంబోజ్ పాక్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా చాలాసార్లు భారత అంతర్గత విషయాల గురించి విదేశీ గడ్డపై ప్రస్తావించి భారత్ చేతిలో చీవాట్లు పడ్డా పాక్ తీరు మాత్రం మారడం లేదు.
జనవరి 22 వ తేదీన అయోధ్యలో దివ్య రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇక ఇటీవలె సీఏఏ విధివిధానాలపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసకు గురై భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. గతంలో కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూ కాశ్మీర్ గురించి పాకిస్థాన్ ప్రస్తావించగా.. భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఉగ్ర దాడులతో పారిన రక్తంతో పాకిస్థా్న్ చేతులు తడిసిపోయాయని భారత్ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్కు లేదని గట్టిగా హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa