తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం వైజాగ్ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన న్యాయసాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వైఎస్ఆర్ వారసత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవాళ్లని రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం వైఎస్ఆర్ కల అని చెప్పిన రేవంత్.. ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతుగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. వైఎస్ఆర్ వారసురాలు షర్మిలేనని అన్నారు. అలాగే వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లకు కూడా పరోక్షంగా కౌంటరిచ్చారు. వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలా రెడ్డి అంటూ రేవంత్ అభివర్ణించారు. వై షర్మిలారెడ్డి అనే పదంలోనే వైఎస్ఆర్ ఉన్నారని గుర్తు చేశారు.
అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటరిచ్చారు. తమ దగ్గర కూడా ఎర్నేటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నాడని .. ఆయన పేరును కూడా షార్ట్ చేస్తే వైఎస్ఆర్ అవుతుందన్నారు. అంతమాత్రాన ఆయన వైఎస్ఆర్ అయిపోతారా అంటూ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైసీపీని గెలిపించి సీఎం జగన్కు కానుకగా ఇస్తామని అమర్నాథ్ అన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమన్న అమర్నాథ్.. ఆయన గెలుపు కోసం అవసరమైతే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని అధిష్టానానికి చెప్పినట్లు గుర్తుచేశారు. అయితే అధినేత తన మీద నమ్మకంతో గాజువాక సీటు ఇచ్చారన్న అమర్నాథ్.. ఇక్కడి నుంచి గెలిచి గాజువాకను గిఫ్టుగా ఇస్తానన్నారు.
ఇక గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని పదేళ్లుగా చూస్తున్నానన్న అమర్నాథ్.. తిప్పల కుటుంబానికి మూడు తరాల రాజకీయ అనుభవం ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే గాజువాకలో తనను బరిలో నిలుపుతున్నట్లు చెప్పారు. తిప్పల నాగిరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి, గాజువాక లో విజయం సాధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa