రాయలసీమ వాసులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తక్కువ ఛార్జీలతోనే విమానంలో ప్రయాణించేందుకు అవకాశాన్ని కల్పించింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం కారణంగా రాయలసీమ వాసులకు విమాన ప్రయాణం చౌకగా మారనుంది. వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఈ మేరకు మరో ఏడాది పాటు పొడిగించింది. దీంతో రాయలసీమవాసులకు ఈ అవకాశం మరో ఏడాది పాటు కొనసాగనుంది.
కడప- హైదరాబాద్, కర్నూలు- బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అయితే కడప నుంచి హైదరాబాద్కు, కర్నూలు నుంచి ఆయా ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నందుకు విమానయాన సంస్థకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. కడప–హైదరాబాదు సర్వీసు నడిచేందుకు రూ.12 కోట్లు, కర్నూలు నుంచి బెంగుళూరు, చెన్నై, విశాఖపట్టణానికి సర్వీసులు నడుస్తున్నందుకు ఇండిగోకు 33 కోట్లను కేటాయించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్టుమెంటు ద్వారా ప్రభుత్వం ఈ సాయం అందించనుంది.
ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం విమాన సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పాటు.. రీజనల్ కనెక్టివిటీ కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ ఉడాన్ పథకం అమలు చేస్తోంది. అయితే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఏపీలో మూడేళ్లపాటు ఉడాన్ పథకం సాగింది. ఆ తర్వాత బెల్గాం తప్ప మిగతా రూట్లలో ఇండిగో తమ సర్వీసులను నిలిపి వేసింది. కేంద్ర ప్రభుత్వ రీజినల్ కనెక్టివిటీ స్కీం (ఆర్సీఎస్)మూడేళ్లు మాత్రమే వీజీఎఫ్ నిధులను కేంద్రం భరిస్తుంది.ఈ గడువు 2024 మార్చితో ముగియనుంది.
అయితే రాయలసీమ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా వీజీఎఫ్ నిధులు అందించేందుకు ముందుకువచ్చింది. ఈ క్రమంలోనే మరో ఏడాది పాటు వీజీఎఫ్ పథకాన్ని పొడిగించింది. ఆ రకంగా మరో ఏడాది పాటు రాయలసీమవాసులకు చౌకధరలో విమాన ప్రయాణ అవకాశం కలగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa