ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 07:34 PM

తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా.. నేరుగా క్యూ లైన్‌లలో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మంగళవారం నుంచి భక్తులకు వేచి ఉండే అవకాశం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం భక్తుల రద్దీ కనిపించింది.. మంగళవారం నుంచి పరిస్థితి మారిపోయింది.. భక్తుల రద్దీ తగ్గిపోయింది. విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ గణనీయంగా తగ్గిపోయింది.


మరోవైపు మంగళవారం స్వామివారిని 63251 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 23,107మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై స్వామివారు విహరించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. తెప్పోత్సవాల్లో తొలిరోజు (మార్చి 20)న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు


లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్దేశించిన విధివిధానాల మేర‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి క‌ల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు మరియు విఐపిలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.


పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు


కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 20 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 19న సాయంత్రం 6 గంట‌ల‌కు మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. మార్చి 20న ఉద‌యం 8 నుంచి 8.45 గంట‌ల‌ వరకు ధ్వజారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. సాయంత్రం 6 గంట‌లకు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు.


మార్చి 21న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది. మార్చి 22, 23, 24వ తేదీల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 25న ఉద‌యం 9 నుంచి 10.45 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 5 గంట‌లకు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వహించనున్నారు. మార్చి 26న సాయంత్రం 5.30 గంట‌లకు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa