రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తమపై నమోదైన కేసుల వివరాలు అందజేసేలా రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీలను ఆదేశించాలని కోరుతూ ఎన్నికల్లో పోటీచేస్తున్న పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలు గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారం పై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఆదేశాలిచ్చారు. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజనపార్టీ అధ్యక్షుడు బి. రామచంద్రయాదవ్ హైకోర్టులో వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వీవీ సతీష్, పీవీజీ ఉమేశ్చంద్ర, తదితరులు వాదనలు వినిపించారు. రానున్న జనరల్ ఎన్నికల్లో పిటిషనర్లు పోటీ చేయబోతున్నారని, వారిపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ పత్రాల్లో ప్రస్తావించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలు అభ్యర్థులకు అందజేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa