ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు గానూ జగన్ను నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ మూడో తేదీన చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. పూతలపట్టు సభలో చంద్రబాబుపై సెటైర్లు వేసిన జగన్.. చంద్రబాబును అరుంధతి సినిమాలోని విలన్ క్యారెక్టర్తో పోల్చారు.
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచివచ్చిన పశుపతిలా.. ఐదేళ్ల తర్వాత అధికారం కోసం పసుపుపతి వస్తున్నారంటూ చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. అలాగే చంద్రముఖిలా లకలక అంటూ రక్తం పీల్చేందుకు రెడీ అయ్యారని, నేరాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని జగన్ మీద చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించిన సీఈవో.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్కు నోటీసులు ఇచ్చారు. గడువులోగా వివరణ ఇవ్వకపోతే.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు జగన్ మీద చేసిన వ్యాఖ్యలకు గానూ ఇప్పటికే చంద్రబాబుకు సైతం ఈసీ నోటీసులు ఇచ్చింది. వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుకు సైతం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa