ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సీఎం జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిన పింఛన్దారులను ఎండలో సచివాలయాలకు తిప్పారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి రూ.4000 పింఛన్ ఇంటి వద్దే ఇస్తుందని తెలిపారు. దర్శిలో పింఛన్దారులతో జగన్ రెడ్డి డ్రామాలు చేశారని మండిపడ్డారు. న భూతో.. నభవిష్యతి రూ.3000 పెన్షన్పై అధికారంలోకి వచ్చాక మాట మార్చి రూ.32వేలు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. రూ.200 నుంచి రూ.2000కి పెంచిన ఘనత చంద్రబాబుదని అన్నారు. జగన్ రెడ్డి పింఛన్ పెంచింది కేవలం రూ.1000 మాత్రమేనన్నది నిజమన్నారు. ధరలు పెంచకుండా చంద్రబాబు రూ.1800 పింఛన్ పెంచారని గుర్తుచేశారు. 39 లక్షల పెన్షన్లను ఐదేళ్లలో 54.25 లక్షలకు చేర్చారని చెప్పారు. జగన్ రెడ్డి ఐదేళ్లలో పెంచింది కేవలం 10 లక్షలు మాత్రమేనని అన్నారు. సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలని ఈసీ చెప్పినా కావాలని ర్యాలీలు చేయించారని విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషన్ మొట్టికాయలతో రెండు రోజుల్లోనే పింఛన్ ఇచ్చారని ఇది ఎలా సాధ్యమైంది? అని ప్రశ్నించారు. ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వలేదన్నారు. 3వ తేదీన అప్పు తెచ్చి 4వ తేదీన పింఛన్లు ప్రారంభించారని చెప్పారు. అనారోగ్యంతో చనిపోయిన వారితోనూ శవ రాజకీయం చేశారని ఏకిపారేశారు. ఏప్రిల్, మే, జూన్ పింఛనుతో కలిపి జూలైలో రూ.7000 ఇంటి వద్దనే ఇస్తామన్నారు. జగన్ రెడ్డి శవ రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చెన్నాయుడు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa