ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్- సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో లా నినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం(1970-2020) 87 సెంటీ మీటర్లు కాగా.. ఈ ఏడాది 106 శాతం అధికంగా (సుమారు 92 సెం.మీ.) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల సంస్ధ తెలిపింది.. ఓ మ్యాప్ను కూడా విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ విడుదల చేసిన మ్యాప్లో ఏ, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే కోస్తా, రాయలసీమతో పాటూ ఉత్తరాంధ్రలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా.. ఒక్క జిల్లాలో మాత్రం వర్షాలు అంతంతమాత్రమే అంటోంది వాతావరణశాఖ. శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం లోటు 30శాతం వరకు ఉండొచ్చని ఆ మ్యాప్ ప్రకారం అర్ధమవుతోంది. సిక్కోలుతో మొదలై ఒడిశాలోని కొన్నిప్రాంతాలు.. అలా పశ్చిమ బెంగాల్లో మరికొన్ని చోట్ల వర్షపాతం లోటు ఉంటుందని మ్యాప్లో కనిపిస్తోంది.
నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా ముందుగా రాయలసీమ ప్రాంతంలో విస్తరిస్తాయి.. ఆ తర్వాత మెల్లిగా కోస్తా, ఉత్తరాంధ్ర వైపు వెళతాయి. అయితే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుండగా.. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండొచ్చని ఐఎండీ మ్యాప్ ప్రకారం అంచనా వేస్తున్నారు. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా సముద్రానికి దగ్గరగా ఉంటుంది.. తుఫాన్లు, అల్పపీడనాలు, ద్రోణి ప్రభావం కూడా ఉంటుంది.. అలాంటి చోట్ల ఇలా సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందనే అంచనాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఇది కేవలం అంచనాలు కాగా.. అప్పటికి పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి. జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి.. అప్పటి వరకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అంచనాకు రాలేమని వాదనలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa