ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. గతంలో పింఛన్ల పంపిణీ విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేసిన ఈసీ.. గతంలో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని.. కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని తెలిపింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులను పింఛన్ల పంపిణీకి ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్రెడ్డికి తేల్చిచెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.
ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మే మొదటి వారానికి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండలకి, వేడిగాలులకి జనాలు బయటకు రాలేని పరిస్థితి. ఈ ఎండల్లో పెద్దవాళ్లు రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లి సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకోవడమంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. సకాలంలో డబ్బు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు, ఇంటింటికీ పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా, అంతా సజావుగా సాగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa