ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయ్‌బరేలీలో రాహుల్‌కు పోటీగా దినేష్ ప్రతాప్ సింగ్.. ఒకప్పటి గాంధీల విధేయుడే

national |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 11:15 PM

గత కొన్ని రోజులుగా సాగుతున్న రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే సస్పెన్స్ వీడింది. సోనియాగాంధీ వదిలేసిన రాయ్‌బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇదే స్థానంలో బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ పోటీలో ఉన్నారు. అయితే ఈ దినేష్ ప్రతాప్ సింగ్ గతంలో కాంగ్రెస్‌కు చెందిన నేత మాత్రమే కాకుండా గాంధీల కుటుంబానికి విధేయుడిగా ఉన్నవారిలో ఒకరు. 2018 లో కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్న దినేష్ ప్రతాప్ సింగ్.. ఆ తర్వాతి ఏడాది 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీలో సోనియాతో పోటీ పడి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీజేపీ.. ఉత్తర్‌ప్రదేశ్ మంత్రివర్గంలో కూడా చోటు కల్పించింది. అయితే రాయ్‌బరేలీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న దినేష్ ప్రతాప్ సింగ్.. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో తలపడనుండటంతో ఈ పోరు హోరాహోరీగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.


2018 వరకు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో దినేష్ ప్రతాప్ సింగ్‌ ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ‘పంచవటి’గా ఆయన కుటుంబం అందరికీ తెలుసు. ఇక రాయ్‌బరేలీ నియోజకవర్గంలో దినేష్ ప్రతాప్ సింగ్‌కు, ఆయన కుటుంబానికి గట్టి పట్టుంది. దినేష్ ప్రతాప్ సింగ్ కుటుంబ సభ్యులు ఆ నియోజకవర్గం, జిల్లాలో వివిధ పదవుల్లో ఉన్నారు. 2010, 2016 లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన దినేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. అయితే 2018 లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన దినేష్ ప్రతాప్ సింగ్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీలో సోనియాగాంధీపై పోటీ చేసి. లక్షన్నరకుపైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.


దినేష్ ప్రతాప్ సింగ్ ఓడిపోయినా.. బీజేపీ మాత్రం అతడికి అవకాశాలు ఇస్తూనే వచ్చింది. 2014 తో పోల్చితే 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీలో బీజేపీ ఓటింగ్ సాతం రెట్టింపు కావడం.. 2021లో రాయ్‌బరేలీ జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయి. ఈ క్రమంలోనే దినేష్ ప్రతాప్ సింగ్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా బీజేపీ కట్టబెట్టింది. దీంతో ఆయన మరింత బలమైన నేతగా మారారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న మొత్తం 80 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీ మినహా మిగిలిన ఏ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఆ సీటును కూడా కాంగ్రెస్‌కు దక్కనీయకుండా చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.


స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాయ్‌బరేలీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 3 సార్లు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. మొదట రాయ్‌బరేలీ నుంచి ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ గెలిచారు. అనంతరం 1967 నుంచి 1980 వరకు ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచారు. ఒక్క 1977లో మాత్రమే ఆమె ఓటమి పాలయ్యారు. 1971 ఎన్నిక వివాదం, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు.. ఎమర్జెన్సీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ తరఫున పోటీ చేసిన రాజ్‌నారాయణ్‌ చేతిలో ఇందిరాగాంధీ ఓడిపోయారు.


ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాయ్‌బరేలీ, మెదక్‌ల నుంచి పోటీ చేసి ఇందిరాగాంధీ గెలిచినా.. చివరికి మెదక్‌ స్థానానికే ఆమె పరిమితం అయ్యారు. ఇక 2004 నుంచి సోనియా గాంధీ వరుసగా రాయ్‌బరేలీలో అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల లోక్‌సభ బరి నుంచి తప్పుకున్న సోనియా గాంధీ.. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ వదిలేసిన రాయ్‌బరేలీ స్థానంలో ప్రస్తుతం రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa