ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి స్థానంలో కొడుకు పోటీ.. రాయ్‌బరేలీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 11:18 PM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. రాయ్‌బరేలీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ.. ఈసారి లోక్‌సభ బరిలోకి కాకుండా రాజ్యసభ నుంచి పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. దీంతో రాయ్‌బరేలీ స్థానానికి ఎవర్ని బరిలోకి దించుతారు అనే చర్చ జరిగింది. ఇక ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ పరాజయం కావడంతో ఈసారి పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. ఇక ఆ స్థానానికే పరిమితం అవుతారని అంతా భావించారు.


ఇక వయనాడ్‌తోపాటు అమేథీ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా సాగింది. అయితే చివరి వరకు ఉత్కంఠ రేపిన అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు.. శుక్రవారం ఖరారయ్యాయి. రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా ఎవరూ ఊహించని విధంగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తూ షాక్ ఇచ్చారు. ఇక రాయ్‌బరేలీలో సోనియా గాంధీ స్థానంలో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇక అమేథీలో ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా బరిలోకి దిగనున్నారనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. వాటన్నింటికీ తెరదించుతూ రాయ్‌బరేలీ టికెట్ రాహుల్ గాంధీకి.. అమేథీ టికెట్ కిశోరీ లాల్ శర్మకు దక్కింది.


అయితే శుక్రవారం ఉదంయ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ వెంట సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్‌ వాద్రా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఉన్నారు. ఇక అమేథీ నియోజకవర్గంలో కిశోరీ లాల్‌ శర్మ కూడా నామపత్రాలు సమర్పించారు. మరోవైపు.. వయనాడ్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీ.. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే పోటీ చేశారు. గత నెల 26 వ తేదీన వయనాడ్‌లో తొలి విడతలో పోలింగ్‌ పూర్తయ్యింది.


అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా మే 20 వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఈ స్థానాలకు నామినేషన్లు సమర్పించేందుకు శుక్రవారమే చివరి రోజు కావడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఈసారి అమేథీని వదిలి పెట్టి రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీకి మారడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ పార్టీ.. తామేమీ భయపడటం లేదని.. తమ పార్టీ వ్యూహాల్లో భాగంగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa