ఉత్తర్ ప్రదేశ్లోని కాంగ్రెస్కు కంచుకోటల్లో ఒకటైన అమేథీ పార్లమెంట్ స్థానంలో దశాబ్దాల తర్వాత తొలిసారి గాంధీయేతర వ్యక్తిని ఆ పార్టీ పోటీకి దింపుతోంది. కాంగ్రెస్ నుంచి కిశోరీలాల్ శర్మకు టిక్కెట్ దక్కింది. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఆయన తలపడబోతున్నారు. దీంతో ఆయన ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకుంది. గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిశోరీలాల్.. దశాబ్దాలుగా వారి వెంటే ఉన్నారు. గాంధీలతో 40 ఏళ్లకుపైగా అనుబంధం ఉన్న ఆయన కాంగ్రెస్కు వీరి విధేయుల్లో ఒకరు. పంజాబ్లోని లుధియానాకు చెందిన శర్మ.. 1983లో దివంగత ప్రధాని రాజీవ్గాంధీతో కలిసి అమేథీలో మొదటిసారి అడుగుపెట్టారు.
1991లో రాజీవ్గాంధీ మరణం తర్వాత ఆకుటుంబానికి శర్మ మరింత సన్నిహితులయ్యారు. గాంధీల గైర్హాజరీలో అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాలనే ఆయన పర్యవేక్షిస్తున్నారు. తరుచూ ఈ నియోజకవర్గాలను సందర్శిస్తూ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. సోనియా గాంధీ తొలిసారి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత అమేథీ వెళ్లినప్పుడు ఆమె వెన్నంటి ఉన్నది ఆయనే. రాహుల్గాంధీ కోసం అమేథీని వదిలి రాయ్బరేలీ నుంచి పోటీ చేసినప్పుడు యువరాజు వెంట ఉన్నది కూడా కిశోరీలాల్ శర్మనే.
తనకు అమేథీ నుంచి పోటీకి అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ అగ్రనేతలకు శర్మ ధన్యవాదాలు తెలిపారు. ‘చిన్న కార్యకర్త అయిన నాకు.. గాంధీల కుటుంబానికి కంచుకోట లాంటి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించినందుకు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు.. గత 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గం కోసం పనిచేస్తూ ఉన్నాను.. గెలుపుకోసం కష్టపడి పనిచేస్తాను’ అని అన్నారు. అయితే, ఓటమికి భయపడి రాహుల్ గాంధీ అమేథీని వదిలేశారన్న బీజేపీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆయన ఎవరికో భయపడి అమేథీ నుంచి వెళ్లిపోలేదని, దేశం కోసం పోరాడుతున్నారని అన్నారు. అమేథీ, రాయబరేలీలో నామినేషన్కు శుక్రవారమే చివరి రోజు కావడంతో రాహుల్ గాంధీతో కలిసి కిశోరీలాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా అమేథీ, రాయ్బరేలీ స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa