ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ, యోగి మధ్య చిచ్చుపెట్టిన కేజ్రీవాల్.. జైలు నుంచి రాగానే సంచలనం!

national |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 10:35 PM

లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం.. ఆ పార్టీకి పెద్ద ఊరటనిచ్చింది. శుక్రవారం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సాయంత్రం తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆప్ కార్యకర్తలు భారీ ర్యాలీతో ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఢిల్లీలోని కన్నౌట్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కేజ్రీవాల్.. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతలను జైలుకు పంపించడమే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా అణగదొక్కుతుందని కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ నేషన్.. వన్ లీడర్ మిషన్‌ను ప్రారంభించారని.. మరోసారి అధికారంలోకి రాగానే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాజకీయ భవిష్యత్‌ను అంతం చేస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరోసారి గెలిస్తే.. గెలిచిన 2 నెలల్లోనే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం మార్పు ఉంటుందని అన్నారు.


గతంలో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, రమణ్ సింగ్‌ లాంటి వారి రాజకీయ భవిష్యత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు పలికారని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. మోదీ గెలిచిన 2 నెలల్లోనే యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ను మార్చేసి.. మరొకరిని ఆ స్థానంలో కూర్చోబెడతారని ఆరోపించారు.


మన దేశం చాలా పురాతనమైందని.. ఎప్పుడైతే ఒక నియంత దేశాన్ని తమ అధీనంలోకి తీసుకుందామని ప్రయత్నించారో.. ప్రజలు వారిని కూకటి వేళ్లతో పెకలించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక నియంత భారత దేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను తాను వేడుకుంటున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఇంజనీర్లు అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక దేశంలోని చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎంలను మార్చేసి వారి రెక్కలను కత్తిరించారని ఆరోపించారు.


లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించిన కోర్టు.. ఓటింగ్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్‌పై విచారణ జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని కోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa