ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చార్‌ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి కొండల్లో పడిగాపులు.. వీడియోలు వైరల్

national |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 10:27 PM

చార్ ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు ఎగబడుతున్నారు. దీంతో శనివారం ఉదయం.. కొండ ప్రాంతాల్లో భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. దీంతో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల పొడవునా భక్తులు గంటల తరబడి వేచిచూస్తున్నారు. చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాల తలుపులను శుక్రవారం తెరిచారు. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ నాలుగు ఆలయాలను అక్షయ తృతీయ పండగ సందర్భంగా.. శుక్రవారం తెరిచారు.


చార్ ధామ్ యాత్ర మొదలు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ నాలుగు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. దీంతో దర్శనాల కోసం గంటల తరబడి సమయం పడుతోంది. ఇక కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచిచూసిన భక్తులు.. ఆలస్యం కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీడియోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. యాత్రికుల భద్రత, రద్దీ నిర్వహణకు సంబంధించి అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని.. దీంతో ఇరుకైన రహదారిలో సుమారు రెండు గంటలకు పైగా నిలబడ్డామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ క్రమంలోనే యమునోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న పరిస్థితికి సంబంధించిన వీడియోలను ఓ భక్తుడు ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని ట్యాగ్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్‌లో నిర్వహణ ఏర్పాట్లు చేస్తే.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం భక్తులతో కొనసాగుతున్న రద్దీ వల్ల.. ఇరుకైన కొండ ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.


చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ప్రతీ సంవత్సరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయాలకు సమీపంలో ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శీతాకాలం సందర్భంగా ఈ 4 ఆలయాలు మంచుతో కప్పబడి ఉండటంతో ఆ సమయంలో మూసివేసి.. తిరిగి వేసవిలో ఆలయ తలుపులను తెరుస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa