ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు మరోసారి ఊరట.. ఆ పిటిషన్ తిరస్కరణ

national |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 09:02 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో మరో ఊరట లభించింది. మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గత నెలలో కాంతి భాటీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్య తీసుకుంటారని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.


చట్టపరంగా ఈ పిటిషన్‌కు ఎటువంటి అర్హత లేదని ధర్మాసనం ఉద్ఘాటించింది. అన్ని అంశాల్లోనూ మేము జోక్యం చేసుకోలేమని, అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకుంటారని పేర్కొంది. పిటిషన్ విచారణలో ఎల్జీ అధికారాలను కోర్టు ప్రస్తావించడంతో లెఫ్టినెంట్ గవర్నర్, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మరో కొత్త వివాదం తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు నిధులు అందాయని ఆరోపిస్తూ.. విచారణకు గవర్నర్ డిమాండ్ చేస్తున్నారు.


మార్చి 21న మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయితే, అది చట్టవిరుద్దమని పేర్కొంటూ వేసిన పలు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ‘గవర్నర్‌కు మా సూచనలు అవసరం లేదు. అతనికి సలహా ఇవ్వడానికి మేము లేం.. చట్టానికి లోబడి ఆయన చేయాల్సిందంతా చేస్తారు’’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.


కాగా, 2019లోనూ క్రిమినల్ కేసులో కేజ్రీవాల్ విచారణ ఎదుర్కొంటున్నప్పుడు కోర్టు ఇదే విధమైన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘ప్రాసిక్యూషన్ ఇంకా కొనసాగుతోంది. ఆయన నిర్దోషిగా బయటపడొచ్చు.. అప్పుడు మీరు ఏమి చేస్తారు? అతను దోషిగా తేలిన తర్వాత రండి’ అని నాటి ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. కాగా, రెండు రోజుల కిందట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa