ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి నక్సల్స్‌కు చావుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 8 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 09:03 PM

దండకారణ్యంలోని మావోయిస్ట్‌ల కోటకు బీటలు వారుతున్నాయి. ఇటీవల భద్రతా బలగాలతో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారు. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బోటెతంగో ప్రాంతంలో మావోల కోసం డీఆర్జీ దళాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన నక్సల్స్ కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


రెండు రోజుల కిందట బీజాపుర్‌ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ యాంటీ-నక్సల్స్ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 16న కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఘటన. ఏప్రిల్‌ 30న నారాయణ్‌పుర్‌, కాంకేర్‌ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరో 10 మంది మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 111 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa