మండే ఎండలతో సతమతమైన ఏపీవాసులను గత కొద్దిరోజులుగా వరుణుడు పలకరిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో మూడురోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకూ విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా.. ఏపీ వ్యాప్తంగా మరో ముడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు మే 21 నుంచి ఏపీ వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో రేపు(గురువారం) అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం,శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే ఎల్లుండి (శుక్రవారం) అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 38.5మిమీ, మన్యం జిల్లా పాలకొండలో 35.2మిమీ, శ్రీకాకుళం జిల్లా హీరామండలంలో 35.2మిమీ, పాతపట్నంలో 22.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు., చెట్ల కింద ఉండే పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa