ఈసారి దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ఉత్తర భారత రాష్ట్రాల్లో అయితే భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్లోని ఫలోదీలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఈ స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు కావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2019 జూన్ 1 వ తేదీన రాజస్థాన్లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
శనివారం మధ్యాహ్నం రాజస్థాన్లోని ఫలోదీలో ఎండ వేడిమి 50 డిగ్రీలు దాటింది. బార్మర్లో 48.8 డిగ్రీలు, జైసల్మేర్లో 48 డిగ్రీలు, బికనెర్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్లో 40, లుమిడింగ్లో 43, అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. హిమాలయ రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్తోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ప్రదేశ్లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు దాటాయి. ఈ నెలాఖరు వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, చండీగఢ్ల్లో వారం రోజుల పాటు ఇదే రకమైన ఎండలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ క్రమంలోనే ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్రస్థాయి వడగాడ్పులతో రాజస్థాన్లో ఆరుగురు మృతి చెందారని.. ఈ ఒక్క వారంలో ఆ రాష్ట్రంలో ఎండదెబ్బలకు 12 మంది చనిపోయినట్లు తెలిపింది.
రాజస్థాన్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. అన్ని ఆస్పత్రులు, వైద్య కేంద్రాలపై పర్యవేక్షణను పెంచాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa