సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న రూ.4వేల కోట్లతో కలిపి దాదాపు రూ.25వేల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. 66సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో 18మంది సీఎంలు రూ.3,62,375 కోట్ల అప్పు చేస్తే జగన్ రెడ్డి ఒక్కడే ఐదేళ్ల పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పులు చేసి రికార్టు సృష్టించారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్ ‘’అప్పుల ఆంధ్రప్రదేశ్’’గా మార్చేశారని మండిపడ్డారు.బినామీ, ఇష్టమైన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి, కమీషన్లకు కక్కుర్తిపడే పరిమితికి మించి అప్పులు చేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్నికల నోఫికేషన్ తర్వాత కూడా దాదాపు రూ.25వేల కోట్ల అప్పులు చేశారని, దీంతో జూన్ 1 నాటికి కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎమ్ పరిమితీ దాటిపోయిందన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత తెచ్చిన రూ.21వేల కోట్ల ఎవరికి ఇచ్చారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయగలరా?, ఆ ధైర్యం మీకు ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లించి కమీషన్లు దండుకునేందుకే విపరీతంగా అప్పులు చేశారని ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం 10గంటల కల్లా ఎవరి ప్రభుత్వం(టీడీపీ ప్రభుత్వం) వస్తుందో తెలిసిపోతుందని, అప్పుగా రానున్న రూ.4వేల కోట్లు ప్రజా సంక్షేమానికి ఎలా ఖర్చు పెట్టాలో ఆ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.నాలుగు వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని.. కాంట్రాక్టర్లకు చెల్లి్స్తే సీఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడు అవుతారన్నారు. భూవివాదాలు సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డికి సీఎస్గా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. మంగళవారం ఉదయం 10.30కల్లా ఆయన తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం మేలని సలహా ఇచ్చారు. ఇంత చెప్పినా మీరు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తే కమీషన్ల కోసం ఇచ్చినట్లు భావిస్తామన్నారు. చంద్రబాబు ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తే.. మీరు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తిరుగుతున్న జగన్.. ఇకపై కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకోలేరన్నారు.సజ్జల, పేర్ని నాని కదలికలు, వారి ఫోన్లపై డీజీపీ నిఘా పెట్టాలని కోరారు వర్ల రామయ్య. జూన్ 4న కౌంటింగ్ సక్రమంగా జరగకుండా అల్లర్లు సృష్టించాలని వారిద్దరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అల్లర్లకు తాడేపల్లిలో ఏ ప్రణాళికలు రచిస్తున్నారో తెలియదని, పోలీసులు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, మాజీ డీజీపీ కొల్లి రాజేంద్రనాథ్ రెడ్డిల కదలికలపైనా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ నిఘాపెట్టాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa