ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. సీఎం హోదాలో తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల పర్యటన పూర్తైన తర్వాత గురువారం సాయంత్రం 4.41 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తారు. సెక్రటేరియట్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైన చేయనున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్ పైన తొలి సంతకం చేయనున్నారు.
ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నట్లు సమాచారం. రూ.4 వేలకు పింఛన్ పెంపుపై మూడో సంతకం.. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ జీవోపై ఐదో సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 పోస్టులతో ఉపాధ్యాయ నియామకం కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత పలు కారణాలతో తేదీలలో మార్పులు చేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో డీఎస్సీ వాయిదా పడింది.
దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తాము అధికారంలోకి వస్తే.. మెగా డీఎస్సీ ప్రకటిస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. అలాగే టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందటంతో నిరుద్యోగులు మెగా డీఎస్సీపై ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉండనున్నట్లు సీఎంవో వర్గాల సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa