ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే.. అసలు ఇల్లు దాటి బయటికి వెళ్లి తినాలంటేనే భయం వేస్తోంది. ఐస్క్రీమ్లో వేలు, ఆహారంలో బొద్దింక, ఫేమస్ హోటళ్లలోనే కుళ్లిపోయిన మాంసం, పరిశుభ్రత లేని కిచెన్, పాడైపోయిన కూరగాయలు.. ఇలా రోజుకో రకం భయానక సంఘటనలు గత కొన్ని రోజులుగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినపుడు మాత్రమే ఓ వారం రోజుల పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి హడావుడి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ అదే తంతు కొనసాగుతూ ఉంటుంది. అయితే తాజాగా హోటల్కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ చేసిన ప్రయాణికుడికి ఊహించని అనుభవం జరిగింది. ఆయనకు ఇచ్చిన సాంబార్లో చనిపోయిన ఎలుక కనిపించడంతో భయంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నగరంలోనే నికోల్ ప్రాంతంలో పేరు మోసిన ప్రముఖ హోటల్ దేవి దోశ ఫుడ్ జాయింట్కు ఓ వ్యక్తి టిఫిన్ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే టిఫిన్తోపాటు సాంబార్ కప్ కూడా ఇచ్చారు. ఈ సాంబార్ కప్లో స్పూన్ పెట్టగానే లోపల ఏదో ఉన్నట్లు అనిపించింది. దీంతో అది ఏంటా అని బయటికి తీసి చూడగా.. చనిపోయిన ఎలుక కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
సాంబార్లో ఎలుక ప్రత్యక్ష్యం అయిన సంఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ హోటల్లలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. చిన్న చిన్న హోటళ్ల పరిస్థితి ఏంటా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇటీవల ఇలాంటి ఘటనలు రోజుకు ఒకటి బయటికి వస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఈ ఘటనపై సదరు కస్టమర్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ దేవి దోశ ఫుడ్ జాయింట్ హోటల్ యజమానికి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆ రెస్టారెంట్ను సీజ్ చేశారు. ఆ రెస్టారెంట్ కిచెన్లో భద్రతా ప్రమాణాలు లేవని.. అందులోకి ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు వస్తున్నట్లు గుర్తించారు. అంత పరిశుభ్రంగా లేదని తేల్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa