తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుంది. నేను పదేపదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలని ఎందుకు చెబుతానంటే... ఇక్కడ అవకాశాలు మెరుగైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయి. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుంది. అక్కడి ప్రాంతం, ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య నా దృష్టికి వచ్చింది. వారికి అక్కడి క్యాబ్ డ్రైవర్ సోదరులు సానుకూలంగా స్పందించి, వారి భృతి విషయంలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లను అడ్డుకుంటున్నారని, దీంతో అక్కడ బతకలేకపోతున్నామని వందలాది క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను చెప్పేందుకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు అయిపోందని, మీరు హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు, క్యాబ్ డ్రైవర్లు మమ్మల్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడేందుకు కార్యాలయం వెలుపలకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పిన విషయాలను విన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయి. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదు. 2 వేల కుటుంబాల వేదన దీనిలో దాగుంది. మానవత థృక్పధంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం. అక్కడి క్యాబ్ డ్రైవర్ కార్మికులు సైతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన తోటి డ్రైవర్లకు తగు విధంగా స్పందించాలి. రెండు తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది.’’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa