తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం (ఆగస్టు 7) విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రీప్లేస్ చేస్తామని న్యాయస్థానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కండిషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే ఆయనకు కేటాయిస్తామని వివరణ ఇచ్చింది. జగన్ భద్రతా సిబ్బంది సమాచారం ఇస్తే జామర్ వెయికిల్ ఇస్తామని తెలిపింది.
ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి రిపేర్ వచ్చిన సంగతి తెలిసిందే. తన భద్రతపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి రిపేర్ చేయించేంతవరకు జగన్ భద్రతకు ప్రమాదంలేకుండా కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇస్తామని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు.. సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, జగన్ బెయిల్ రద్దు చేసి విచారణను వేగవంతం చేయాలని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
సీబీఐ విచారణ తీరుపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. మే 2న సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణలో ఉండగానే.. ఆరుగురు జడ్జిలు మారిపోయారని, రిటైర్ అయ్యారని రఘురామ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి, ట్రయల్కి సంబంధం లేదన్నారు.
డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, కేసు ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని, తమకు ఎలాంటి అడ్డంకి రావడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ చేపట్టాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని అనుసరించాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. ఇవే మార్గదర్శకాలు సీబీఐకి కూడా వర్తిస్తాయని తెలిపారు. అనంతరం ఈ కేసును నవంబర్ 11కు వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa