తిరుపతిలోని టీటీడీ అడ్మనిస్ట్రేటివ్ బిల్డింగ్లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. టీటీడీ పరిపాలన భవనం ఇంజనీరింగ్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన దస్త్రాలు కాలిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. మరోవైపు మంటలు చెలరేగిన విషయమై ఉద్యోగి నాగార్జున అధికారులకు సమాచారమిచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. మరోవైపు టీటీడీ పరిపాలన భవనంలో ప్రమాదంపై అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇక ప్రమాదంలో దస్త్రాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని సీవీఎన్ఎస్ఓ శ్రీధర్ తెలిపారు. అన్ని దస్త్రాలను ఈ ఫైలింగ్ చేసి సేవ్ చేసినట్లు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో రోడ్లు, టీటీడీ ఆలయాలకు సంబంధించిన దస్త్రాలు కాలిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనపై అధికారులు కూడా విచారణ చేపట్టారు. మరోవైపు అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంటలు ప్రమాదవశాత్తూ చెలరేగాయా.. లేదా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా ఫైళ్లు తగలబెడుతున్న ఘటనల నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఘటన ప్రమాదమా.. లేదా ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉందని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఇంజనీరింగ్ ఫైల్స్ దగ్ధంపై విచారణ సాగుతోందన్న ఆయన.. 25 నుంచి 30 ఫైల్స్ వరకు స్వల్పంగా దగ్దమైనట్లు తెలుస్తోందన్నారు. ఘటనపై విజిలెన్స్, పోలీస్ విభాగం విచారణ చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికిప్పుడే పూర్తి నిర్ణయానికి రాలేమని ప్రమాదం జరిగిన డిప్యూటీ ఈఈ గదిని సందర్శించిన తర్వాత ఎస్పీ చెప్పారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం వద్గ ఫైళ్ల దగ్ధం ఘటన కూడా శనివారం కలకలం రేపింది. ఈ ఘటనలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయాయి. అయితే కార్యాలయంలోని అధికారులే ఈ ఫైళ్లను కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం కాలిపోయిన ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనలో కాలిపోయినవి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన పరిహారానికి సంబంధించిన ఫైళ్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa